Saturday, December 14, 2019

బాపు అనబడు శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ

           శనివారంసెలవు రోజయినా  పొద్దున్నే లేచి  అలవాటు ప్రకారం వెంకటేశ్వర సుప్రభాతం వింటూ కాఫీ  కలుపుకొని తాగుదామని కూర్చున్నాను.  నా కళ్ళు ఎదురుగా గోడపై  తగిలించిన  చిత్రం పై పడ్డాయి.
           అది నేను ఎంతో ఇష్టపడి కొని  పటం కట్టి వేలాడేసిన బాపు వేసిన వెంకన్న పాదాలు అదేనండి బ్రహ్మకడిగిన పాదాలు చుట్టూ వాగ్గేయకారులు మై మరచి స్వామిని కీర్తిస్తున్న అపురూపమైన చిత్రం.
ఠక్కున  గుర్తొచ్చింది  డిసెంబరు 15 బాపు పుట్టిన  రోజని. ఆ జ్ఞాపకాన్ని పొడిగిస్తే ఈ మాటలు  రాయాలనిపించింది.
            యెంత గొప్ప  రోజు!  గీతలతో గోవిందుడి విశ్వరూపాన్ని ని కనులముందు నిలిపిన వ్యక్తి , తెరపై బొమ్మల తో కావ్యాలను రాసిన వ్యక్తి పుట్టినరోజు.  తెలుగువాళ్ళ అదృష్టం బాపు మనవాడవడం.
            భలే అల్లరి పిడుగు బుడుగు నే సృష్టించి  వాణ్ని ముప్పతిప్పలు పెట్ట గ్యానపెసూనాంబని కుడా సృష్టించిన కొంటె వాడు మన బాపు.  అల్లరి చేస్తున్న ప్రతి పిల్లాడిలా బుడుగు కనబడుతూనే ఉంటాడు, రెండుపిలకలేసుకుని , చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ  వయసుకుమించిన కబుర్లు చెప్పే గ్యాన పెసూనాంబలు కనబడని ఇల్లు ఉందా తెలుగునాట.  తమ సంతానం లో వీళ్ళని ఉహించుకొని మాతరం ఆలుమగలు లేరంటే  అతిశయోక్తి కాదు.
            అడపిల్లంటే  బాపుబొమ్మలా ఉందని పోలిక చెప్పే స్థాయికి అయన వేసిన  అమ్మాయిల బొమ్మలు చేరుకున్నాయి.  ముంగిట ముగ్గేస్తు, వాకిలికి తోరణం కడుతూ, వయ్యారంగా దీపాలు పెడుతూ, వాలుజడ భుజాలపైనుండీ  ముందుకేసి వాలు కళ్ల తో చూస్తూ  అబ్బబ్బ బాపు బొమ్మమ్మాయిలు యెంత హొయలు పోతారు. అబ్బాయిలు అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కలలు  కనడమే  కాక ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుంటే
పాపం బ్రహ్మగారు అల్లాంటి అమ్మయిల్ని సృష్టించడాని ఎంత శ్రమించాడో అని పించదూ ?

              అబ్బాయిలకే  కాదు , గంజిపెట్టి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజామా వేసుకుని, ఉంగరాల జుట్టు పాపిడ్ తీసి దువ్వుకుని, వాలుకుర్చీలో కూర్చుని పేపరు చదువు తున్న  అబ్బాయి వరుడు ఇలా ఉండాలనుకునే యెంత మంది ఆడపిల్లల మనసులో మెదులుతాడో చెప్పలేము, ఈ ఊహకి నేనూ  మినహాయింపు కాదండోయ్ .
            కాస్త వ్యంగ్యం , మరికాస్త వెటకారం  అంతకుమించి అనురాగం అది ఉందని ఒప్పుకో ని భేషజం కలబోసి ఒక కథానాయకుడిని సృజించిన వాడూ బాపునే. ప్రతి తెలుగింటి ఇంతీ  తన మొగుడి లో ఈ లక్షణాలని గమనించి, బాపు భలే చెప్పేసాడు కదా  అనుకోకుండా ఉండదు.

           ఇక బాపుగారి కార్టూన్ల గురించి ఏమీ చెప్పాలి? దేహదారుఢ్యతో పెళ్ళాలు ,వెదురుబద్దల్లా వంగిపోయిన  మొగుళ్ళు వారి సంభాషణ ఫక్కుమని నవ్వు తెప్పించకపోతే మీ మీదొట్టు.
మనసు కలత చెందినపుడు చదివితే కడుపుబ్బా నవ్వించే ఎన్నో కార్టూన్లు సృష్టించిన బాపూగారికి మనందరి తరఫునా  హాస్యాభిషేకం.

           అష్ట నాయికలను  సాలభంజికలను చేసి కళారాధకుల  మనసులు రంజింపచేసిన బాపుగారి కుంచెకు కైమోడ్పులు.

            పూవుకి తావిలా బాపు ఊహలకు రమణగారి మాటల ప్రాణప్రతిష్ట.  "అమ్మ కడుపు చల్లగా అత్త  కడుపు చల్లగా పచ్చగా బతకమని " చెప్పిన సాక్షి చిత్రం నుండి, "పొరబడి తడబడితే  తప్పు దిద్దుకోమన్న" పెళ్లి పుస్తకం దాకా ప్రతి చిత్రం ఒక ప్రబోధం.

            బాలరాజుతో మహా బలిపురం కథ చెప్పించినా, అల్లురామలింగయ్య ని 'తీతా ' అని పిలిపించినా, రావుగోపాలరావు తో "హాల్లో హల్లో  హాల్లో అనిపించినా ఆ స్నేహద్వయానికే చెల్లు.

           సీతమ్మ అందం రామయ్య శౌర్యం  తన మనసులో దర్శించి మన కళ్ళకు చూపించిన  బాపుకు మన మేమిచ్చి ఋణం తీర్చుకోగలం? రామానామామృత సాగరం లో  తనకుంచెల పడవలో పయనించిన గుహుడు బాపు.

        బాపూ  మాతో 'కోతికొమ్మచ్చు"లాడి , మా మనసులకు నీ బొమ్మలతో ఇంద్రధనుస్సుల రంగులద్దావు కదయ్యా ! పసుపురాసి గడపల్లో, ముత్యాలముగ్గుల్లో ,కుర్రకారు కలల్లో , కన్నె పిల్లల వాలు చూపుల్లో ,  గోదారి పరవళ్లలో , రాములోరి గుడి ముంగిట్లో నీ విశ్వరూప సాక్షాత్కారమే కదా !

తెలుగుతనానికి బాపు కళ  కదా చిరునామా !

బాపు అనబడు శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణా  తెలుగింట పుట్టిన నీకు, నీ పుట్టిన రోజున ,
తెలుగిల్లు  మెట్టి ,తెలుగుతనం పై మమకారం పెంచుకొన్న నా యొక్క  శుభాకాంక్షలు:

రాశా  






Thursday, December 12, 2019

అభిమాన రచయితకు అశ్రునివాళి

సాయంకాలమయ్యింది
అవును ప్రతిరోజులాగే  ఈరోజూ  సాయంకాలమయ్యింది.  కానీ మదిలో తెలియని వెలితిగా వుంది.

నిజమే సాయంకాలమయ్యింది వేయి కిరణాలతో వెలిగిన సూర్యుడు  నిష్క్రమించాడు.
వేయిపడగలకు దీటైన రచనలు చేసిన  గొల్లపూడి మారుతీరావు విశ్రమించాడు.
వ్యక్తిగతంగా కలవక పోయినా ఆయన రచనలు చదివి అభిమానిగా మారాను.  మనసుకు హత్తుకునే భావ వ్యక్తీకరణ, సులభమైన  సుపరిచితమైన మాటలు పొదిగిన రాతలు, నన్నేకాదు లక్షలాది మంది  అభిమానులను ఆయనకు సంపాదించి పెట్టింది.

సంస్కారవంతమైన సంభాషణలంటే  ఎలా వుంటాయో, సమర్ధుడైన వ్యక్తి  సినిమా కథ రాస్తే  నిజ జీవితాలకు ఎలా దర్పణం పడుతుందో  ఆయన సంభాషణలు రాసిన 'ఆత్మగౌరవం', కథ సమకూర్చిన 'డాక్టరు చక్రవర్తి ' చిత్రాలను చూస్తే  తెలిసి పోతుంది.

నిజాన్ని నిక్కచ్చిగా చెబుతూ అవసరమైతే  చురకలు అంటించే వాక్యాలు చేర్చి సంపాదకీయాలు, వ్యాసాలూ రాయగల సత్తా శ్రీ మారుతి రావుగారికి ఉందంటే  సత్యదూరం కాదు.  .

తన రచనలలో  వాడిన మాటలు  తరాలు మారినా అర్థం మారనివి. ఉదాహరణకి సాయంకాలం అనే నవలలో దేశం వదిలి పోతున్న మనవడు " ఎందుకు నీకు దిగులు" అన్న మనవడికి తన మనసులో ని అలజడి  అర్థం కాలేదని తెలుసుకొని  "నా గుబులు నీ గుండె దాకా  ప్రయాణించాలంటే  ఇంకా కొంత కాలం పడుతుంది " అంటుంది.  అది ఎన్నో ఏళ్ల  క్రితం రాసిన వాక్యం.  ఈనాడైనా కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళుతూ  ఎందుకు దిగులు మీకంటే  ప్రతీ తల్లి తండ్రుల మనసులో సుడి  తిరిగే భావన ఇదే కదా!

ఆయన రచించిన నాటకాలు నేను  ఇంకా చదవలేదు కానీ , ఎంత సామాజిక స్పృహతో  యెంత ఉన్నత విలువలతో రాసి వుంటారో  ఊహించగలను. త్వరలోనే చద డానికి ప్రయత్నిస్తాను .

జీవితం మిగిల్చిన చేదు అనుభవాలన్నీ అంతర్లీనం చేసుకుంటూ, సమాజమనే  తోటలోని లోపాలనే కలుపుమొక్కల్ని  తన రాతల నాగలి తో  దున్ని  ఏరిపారవేయ  ప్రయత్నించిన నిత్య కృషీవలుడు  శ్రీ మారుతి రావుగారు.

బాధల సంకెళ్లు తెంచుకొని, భావాల లావాలు ఆర్పీ వేసి, కాగడాల్లాంటి తన రచనలని మనకు కానుకగా  ఇచ్చి,కానరాని లోకానికి తరలి పోయాడు కానీ కలకాలం మన మనసులలో నిలిచి పోతాడు. 

రచయిత , విమర్శకుడు ,వక్త, నాటక రచయిత,నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి  శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి  గురించి  నా మనసుకు తట్టి ఆయనకు గుడికట్టిన మాటలు.

రాశా